కొండగాలి మనుషుల్ని వణికిస్తుంది.మనసుల్ని కొరికేస్తుంది.కొండపైన వున్న గెస్ట్ హౌస్ మూలానా చలిగాలి మరింత చెలరేగి పొతూఉంది. అక్కడ కూర్చున్న ఐదుగురు పంచ పాండవులు కాదు.ప్రపంచతంత్రంలో మిత్రభేదం లేకుండా విత్తలాభం తెలిసిన వుద్దండులు.
అది ప్రొజెక్ట్ క్రాంట్రాక్టర్ చంద్రశేఖర్ ఎరేంజ్ చేసిన పార్టీ. మిగతా నలుగురూ అతని వ్యాపార సామ్రాజ్యానికి నలుదిక్కులుగా దక్షిణ మేస్తూ రక్షణ నిచ్చే కాసుల కాపరులు. హోదాకి చీఫ్ ఇంజినీర్ అయిన ఆదాయానికి పరమ చీప్ ఇంజీనీర్ గా ముద్రపడ్డ చీఫ్ ఇంజినీర్ మాధవరావు, లంచానికి-మంచానికి ఎక్స్ క్లూజివ్ ఇంజినీర్ గా పేరుపడ్డ ఎగ్సి క్యూటివ్ ఇంజినీర్ హరివిఠల్, చీఫ్ ఇంజినీర్ కనుసన్నల హింటులకు తన ఇండెంటును కలిపి తన ఉధ్యోగమే మనిమింట్ గా మార్చివేసిన ఆఫీస్ సూపరింటెండెంట్ రంగనాధం, 'నా లెక్కాగితే మీ డొక్కాగుతుంది ' అంటూ పళ్ళు ఇకిలిస్తూ తన విషపు కోరలను చూపే ఎకౌంట్స్ ఆఫీసర్ ఫణిభూషణం.
వీళ్ళు తమ లౌక్యంతో సౌఖ్యాలను సొంతం చేసుకునే పబ్లిక్ సర్వెంట్స్ - ప్రైవేట్ మర్చంట్స్.
విస్కీని గ్లాసుల్లోకి సమంగా ఒంపుతున్నాడు రంగనాధం. అందరికీ గ్లాసులను అందించి తన గ్లాసులోని విస్కిని ఒక చుక్క నేలమీదకి ఒంపి తాగనారంభించాడు.
" మందు కొట్టేటప్పుడూకూడా ఈ సెంటిమెంట్స్ ఏంటండీ బాబు " అడిగాడు ఫణిభూషణం. " చిన్నప్పటినుంచి అలవాటు..ఏది తిన్నా తాగినా ఇది తప్పదు " గొప్ప విషయంలా చెప్పాడు రంగనాధం.
"పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు.." వెటకారంగా చెప్పాడు హరి విఠల్
" మన రంగనాధం గారికి ఇది పుట్టుకతో వచ్చింది కాదు..ముట్టుట వలన..ఐ..మీన్ గ్లాసు పట్టుట వలన వచ్చింది " నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్. నవ్వారందరూ.
" ఇవాళకూడా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయ్యేటట్టేవుంది..ఈరోజు కూడా ఇంట్లో రామాయణమే " చెప్పాడు రంగనాధం వాచీ చూసుకుంటూ.
" ఏ రామాయణమండోయ్..? " వ్యంగ్యంగా అడిగాడు ఫణిభూషణం.
"బాల రామాయణమే.." తాపీగా చెప్పాడు రంగనాధం.
" పిల్లలు గొడవ చేస్తున్నారా..? " ప్రశించాడు మాధవరావ్ మెల్లగా సిప్ చేస్తూ.
" పిల్లలు కాదు సార్..పెళ్ళామే.." వివరించాడు రంగనాధం.
" మరి బాల రామయణమంటున్నారు ..?" ప్రశ్నించాడు హరివిఠల్.
" అదేనండి బాబు..మా ఆవిడ పేరు బాలాత్రిపుర సుందరి.." చెప్పాడు రంగనాధం. ఘొల్లున నవ్వారందరూ, అతనుచెప్పిన తీరుకు.
" ఈ ఆడోళ్ళు మరీ విచిత్రమండి..సంపాదన లేకుంటే సన్యాసికింద జమ కడతారు. సంపాదనలో పడి..ఇలా కాస్త లేట్ గా ఇంటికి వెళ్ళామా అంటే..యివెక్కడి సన్నాసి అలవాట్లు అంటూ గోల చేస్తారు..రెండు నాల్కలు వాళ్ళకి.." చెప్పాడు ఫణిభూషణం.
" అందుకే వున్న ఒక్క నోరు గట్టిగా మూయించలా .." చెప్పాడు చంద్రశేఖర్.
" శెభాష్..బహు బాగా శెలవిచ్చారు.." అరిచి చెప్ప్పాడు రంగనాధం.
" వాళ్ళు అనేదాంట్లోనూ అర్ధముంది. మీరు ఏదైనా చెయ్యండి..ఏంతైనా సంపాదించంది..ఇన్ టైం లో చెయ్యమని వాళ్ళ అర్ధం.." ముసిముసినవ్వులు నవ్వుతూ చెప్పాడు మాధవరావ్.
" ఓహో..బ్రహ్మండంగా శెలవిచ్చారు..గురువు గారు..దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నట్లు...సీట్లొ....." నాలిక కరుచుకుని మాధవరావ్ కాలిమీద గట్టిగా కొట్టాడు రంగనాధం.ఎంత గొప్పగా చెప్పారన్నట్లు చూస్తూ. మూడుపెగ్గులు పడగానే చనువు ముదురుతుంది రంగనాధానికి. అదే నచ్చదు మాధవరావ్ కి . కడుపు మండింది అందుకే.
" ఇలా మంచినీళ్ళు తాగినట్లు తాగితే, చక్కదిద్దుకునే మాట దేవుడెరుగు..దీపమే ఆరిపోతుంది.." చెప్పాడు మాధవ రావ్ కాస్త కోపంగా.
" అనుకుంటాం గాని సార్..! సిగెరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ అని, మందు కొడితే బ్లడ్ క్యాన్సర్ అని ..పోయేరోజు వస్తే ఏలానూ పోతాం.. " చెప్పాడు హరివిఠల్. గ్లాసులోకి విస్కినీ ఒంపుకుంటూ.
"ఏమంటారు చంద్రశేఖర్ గారు ? సీన్ వున్నప్పుడే..ప్లాన్ చేసుకోవాలి..." అన్నాడు అతడ్నికూడా కలుపుకుంటూ.
."మీరు చెప్పింది నిజమే, మాగ్గాళ్ళ కంటే ఏవో దిక్కుమాలిన అలవాట్లుంటాయ్ రోగాలు వచ్చాయనుకోవచ్చు.. మరి ఆడవాళ్ళకొచ్చే క్యాన్సర్ల సంగతేమిటి..? " ప్రశ్నించాడు చంద్రశేఖర్ అందరివంకా చూస్తూ.
తలుపు తీసిన చప్పుడైతే తిరిగి చూసారు అటువైపు. తలుపు అవతల నిలబడి వున్నాడు చంద్రశేఖర్ తరుపున పనిచేసే సైట్ సూపర్ వైజర్ బాల్ రెడ్డి.
" సారి సార్..మీకు ఫోను..ఇంట్లో ఎవరికో సీరియస్ అంట..మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మనారు.." మెల్లగా చెప్పాడు బాల్ రెడ్డి.విన్న చంద్రశేఖరానికి పిచ్చకోపం వచ్చింది.
" ఫూల్ ఎవరికిరా.. సీరియస్..? " కొపంగా అడిగాడు చంద్రశేఖర్.
" సరిగ్గా వినిపించలేదు సార్..డిస్టర్ బెన్స్ వస్తుంది..మిమ్మల్ని ఉన్నపళంగా..." ఆగిపోయాడు బాల్ రెడ్డి, చంద్రశేఖర్ కళ్ళల్లో కోపాన్ని చూసి.
" ఈడియట్ ..ఏ పనీ సరిగా చేసి ఏడవ్..ఫో బయటికి.." కసిరాడు కోపంగా. మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు బాల్ రెడ్డి.
గ్లాసులోని విస్కిని ఒక్క గుక్కలో మింగాడు చంద్రశేఖర్ ఆలోచనలో పడి. మండింది గొంతు. అది సోడా కలపని విస్కి. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. గబగబా వాటర్ బాటిల్ ని ఎత్తి గొంతులోకి వంపుకున్నాడు. పళ్ళమధ్య మాంసం ముక్క నలిగిపోతున్నది. ఒంట్లో రక్తం మరుగున్నట్లుంది. మాట్లాడవలసిన బిజినెస్ మేటర్ చాలానే వుంది. మధ్యలో వెధవ న్యూసెన్స్.. ఇంతకీ తేడా ఎవరికి ? తండ్రికా ? తల్లికా ? ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కుతుంది. గ్లాసు మరలా కాళీ అయ్యింది.
"మరి ఇప్పుడే బయలుదేరతారా..? " ప్రశ్నించాడు హరివిఠల్. తలూపాడు చంద్రశేఖర్. "హైద్రాబాద్ దాకా వెళ్ళాలి కదా..మరో పెగ్గు వేషుకోండి.."వూగిపోతూ చెప్పాడు రంగనాధం. వద్దని తల అడ్డంగా వూపాడు చంద్రశేఖర్.
ఎవరితోనూ మాట్లాడబుద్ధి వేయడం లేదు అతనికి.అందరివద్దా సెలవు తీసుకుని బయలుదేరాడు చంద్రశేఖర్. ఎంత అలోచించినా సీరియస్ అయ్యింది ఎవరికో అర్ధం కావడం లేదు. మత్తు ఆలోచనలను ముంచేసింది. మనిషిని నిద్రలోకి జార్చింది. కారు వెనుకసీట్లో వాలిపోయాడు చంద్రశేఖర్. కారు ముందుకు దూసుకుపోతుంది.
*****
సివిల్ ఇంజినీరింగ్ చేసి కాంట్రాక్టర్ వృత్తిని చేపట్టాడు చంద్రశేఖర్. శ్రీశైలం ప్రోజెక్ట్ లో పెద్ద కాంట్రాక్టర్. వ్యాపారంలో లాభం- వ్యవహారంలో ముభావం , అదీ అతని స్వభావం. సొమ్ముకు అమ్మకం కానిది ఏదీ లేదన్నది అతని నమ్మకం.హైద్రాబాద్ కి డబ్బై కిలోమీటర్ల దూరాన గల 'నారాయణపురం ' అతని స్వస్థలం. తండ్రి పట్వారీగా పనిచేసి సంపాదించిన ఆస్తులకంటే నాలుగైదు రెట్లు ఎక్కవే సంపాదించాడు ఈ వృత్తిలో కొచ్చి. ఆ వూళ్ళో అత్యంత ధనవంతుల కుటుంబం అతనిది. పల్లెలో పుట్టినా, పట్నవాసపు వాసనలు పీల్చిన తరువాత, పల్లెటూరంటేనే పరమ చిరాకు అతనికి.
అతని భార్య ' శకుంతల ' అతనికి పూర్తిగా భిన్నం. అగ్రి కల్చరల్ బి.యస్సీ చదివిన మహిళ. అంతలా చదువుకున్న ఆడవారు మరెవ్వరూ ఆ వూళ్ళో లేరేమో..? తను చదువుకున్న చదువు సార్ధకం కావాలంటే 'పల్లే' దానికి అనువైన నెలవు అనుకుంది. ఆమె అంటే ఇంట్లో వారికే కాదు..వూళ్ళో వారికి కూడా అమితమైన గౌరవాభిమానాలు -ప్రేమానురాగాలు.
******
కారు దుమ్ము రేపుకుంటూ దూసుకుపోతుంది. పల్లెజనాలు ఆగి నిలబడి విచిత్రంగా చూడసాగారు. కారు కుదుపులకు మెలుకువ వచ్చింది చంద్రశేఖరానికి. నారాయణపురం ఇంకా కిలోమీటర్ దూరంలో వుంది. రాత్రి తాలుకా సంఘటనలు మెల్లగా గుర్తుకు రాసాగాయి. ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి మనసుని-కారు ఇంటి సందు మలుపు తిరుగుతుండగా గమనించాడు చంద్రశేఖర్, ఇంటిముందు జనం గుమిగూడి వుండటాన్ని. మనసులో కీడు తొంగి చూసింది తండ్రివైపు- ఏమయ్యుంటుందీ ? మళ్ళా హార్ట్ ఎటాక్ గానీ వచ్చిందా ? అలోచనాకెరటం ఉవ్వెత్తున లేచింది మనసులో, తండ్రి గురించిన బాధలా - తండ్రి రూపం, పట్వారీగా ఆయన దర్జా, బతికిన శైలీ గుర్తుకురాసాగాయి -
కారు ఇంటిముందు ఆగింది. అందరి మొహాల్లోకి తొంగి చూసాడు లోపలినుంచే. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా వున్నాయి. అది గుండెలోతుల్లోని దు:ఖం వలనో, గొంతు వరకు తాగిన లిక్కర్ వలనో తెలియదు. ఒంట్లోని శక్తిని కూడదీసుకుంటూ క్రిందకు దిగాడు మెల్లగా.
" శేఖర్ అన్యాయం అయిపోయిందిరా " కౌగిలించుకుని బావురుమన్నాడు చంద్రశేఖర్ బాల్య స్నేహితుడు రాఘవ.
మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ కళ్ళల్లో కనిపించింది. " నాన్నా..." అంటూ గుండె రోదిస్తుండగా వినిపించాయా మాటలు.
" దేవుడా..! ఎంత దుర్మార్గుడివిరా..! మేమేం పాపం చేసినామనిరా ఇంత దారుణం చేసావ్..? నీకు మొక్కిందానికి..మాసావు మమ్మల్ని సావమనా దాన్ని తీసుకుపోయావ్...?" గుండేలవిసేలా విలపిస్తున్నాడు చంద్రశేఖర్ తండ్రి సీతారామయ్య. షాకైపోయాడు చంద్రశేఖర్. చనిపోయింది తండ్రి కాదు.. మరి తల్లా..?
తట్టుకోలేకపోయాడు ఆ ఆలోచనకే. ఒక్కక్షణంలో తెలియని . ఇప్పటికీ తనని చిన్నపిల్లాడిలా భావించి మాట్లాడే తల్లి...కన్నతల్లి..ఇకలేదు..కొండను ఢీ కొన్న అలలా చిధ్రమైంది మనసు." అమ్మా.." అంటూ అరిచాడు గుండె పగిలేలా..ఘొల్లుమన్నారు జనం చంద్రశేఖరాన్ని చూసి. ఒక్కసారిగా విషాదం విలయతాండవం చేసింది ఆ ప్రాంగణమంతా. అందరి కళ్ళల్లోనూ కన్నీరు.అందరూ ఒక్కసారిగా అనాధలైన తీరు..."అమ్మా.." అంటూ విలపిస్తూ వడివడిగా అడుగులేసాడు చంద్రశేఖర్ మిద్దెలా వున్న అరుగుమీదకి-
" నాయనా చంద్రం..నీ బ్రతుకు అన్యాయమై పోయిందిరా..అన్యాయం అయిపోయింది..వెళ్ళిపోయిందిరా..మనల్ని అన్యాయం చేసి..నాయనా..అయ్యో.." అంటూ విలపిస్తున్న 'తల్లి 'ని చూసి స్థాణువైపోయాడు చంద్రశేఖర్. అడుగుముందుకు పడలేదు. కాళ్ళ వద్దే వుంది శవం- అతి చేరువగా-
'అతనితో పాటు ఏడడుగులు నడిచిన కాళ్ళు...' ఇక నడవలేమంటూ అచేతనమై వున్నాయి. పెళ్ళి నాడు అతని కాలుని సుతిమెత్తగా స్పృశించిన ఆమె కుడికాలి బొటనవేలు, ఎడమకాలి బొటనవేలుతో బంధమై, ఈ జన్మబంధాన్ని తెంపుకుని నిశ్చలంగా వుంది. అర్ధాంగిగా అతని నిండు జీవితానికి పూర్తిగా అర్ధాన్ని యివ్వాల్సిన మనిషి...యిలా అర్ధాంతరంగా వెళ్ళిపోయింది మరలిరాని లోకాలకి -
ఊహించని ఉత్పాతం ఉప్పెనై ఆతని హృదయాన్ని ముంచెత్తింది. శోకసంధ్రమైన మనసులోని దు:ఖం తన తీరాన్ని దాటి కళ్ళను చేరుతుంది. కన్నీళ్ళు పొరలుపొరలుగా కళ్ళను కమ్ముతుండగా, అస్పష్టంగా చూసాడు చంద్రశేఖర్ భార్యవంక. నిర్మలంగా వుంది ఆమె మొహం...ఎప్పటిలానే -
"ఎంత అన్యాయం చేసావ్ శకుంతలా..? నీకేం ద్రోహం చేసానని ఇంత శిక్ష విధించావ్..? నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి..? చెప్పు..శకుంతలా..చెప్పు..? ఎంత అన్యాయం చేసావ్ మమ్మల్నందర్ని..? " చంటిపిల్లాడిలా విలపిస్తున్నాడు చంద్రశేఖర్.
ఇప్పుడతను కోట్లకు పడగెత్తిన రారాజు కాడు.జీవితపు తోడు పోయి, జీవితాంతం గోడు మిగిలి, గుండె పగిలి రోదిస్తున్న..'అనాధ '-
"డాడీ..అమ్మను బ్రతికించండి డాడీ..అమ్మకావాలి డాడీ..అమ్మకావాలి.. అమ్మా.. అమ్మా..ఒక్కసారి చూడమ్మా..అమ్మా..ఒక్కసారి.." అంటూ అతడిని కౌగిలించుకుని విలపిస్తున్నారు పిల్లలు. హృదయవిదారకంగా విలపిస్తున్న కూతుర్నీ,కొడుకునీ తన గుండెలో పొదవికుంటూ...
" వెళ్ళిపోయింది తల్లీ..వెళ్ళిపోయిందిరా..మనల్ని మోసం చేసి మీ అమ్మ వెళ్ళిపోయిందిరా..శకుంతలా..ఎంత అన్యాయం చేసావ్.."బావురుమన్నాడు చంద్రశేఖర్ భార్య తల వద్ద కూలబడిపోయి.
అందరి హృదయాల్ని కలచివేసింది ఆతని దు:ఖం. ఆమె తాలుకూ అనుభూతులు. .వేదనలై..రోదనలై.. ప్రతిధ్వనించాయి అందరి గుండె లోతుల్లోంచి.
" ఊర్కో..శేఖర్..ఊర్కో..నువ్వుకూడా ఏమిటిలా..? చిన్నపిల్లడిలా ..? సముదాయిస్తున్న రాఘవ గొంతు పెగల్లేదు..శోకంతో నిండిపోయింది -
పిచ్చివాడిలా భార్యనే చూస్తుండిపోయాడు చంద్రశేఖర్. ఆమె స్మృతులు, అనుభూతులు అలలై ఎగసిపడుతున్నాయి అంతరంగాన-శోకసంద్రాన...!
" ఎన్నో నవ్వులు..ఎన్నో మాటలు..ఎన్నో సరదాలు..ఎన్నో సరసాలు..ఎన్నో కోపాలు..ఎన్నో తాపాలు..ఎన్నో సేవలు..మరెన్నో ఆశలు..అన్నీ నిండివున్నాయి తనలో, ఆమెతోటి -రాజహంస పాలునీ, నీళ్ళనీ వేరుచేసి పాలునే సేవించినట్లు, ఆమె సుఖదు:ఖాలనీ వేరుచేసి, తమకు సుఖాల్నే పంచింది..ఇప్పుడు సుఖంగా వెళ్ళిపోయింది..దు:ఖాన్ని మిగిల్చి..దూరం తెలియని తీరాలకు -ఎంతో ఖుషీగా వుండే మనిషి. విలాసాన్నంతా తన సొంతం చేసుకుని, విషాదాన్ని మిగిల్చింది తన వాళ్ళకి - "శకుంతలా..! నీ మనసులోని ఆర్తిని వినలేకపోయాను. నీ శరీరంలోని రోగాన్ని గమనించలేకపోయాను..అందుకు ఇంత శిక్ష విధించావా..? " రోదిస్తున్నాడు చంద్రశేఖర్ కుమిలిపోతూ -
" స్త్రీణాంచ చిత్తం పురుషస్య బాగ్యం..అన్నారు పెద్దలు. ఆమె వల్లనేనయ్యా మాకీ భోగభాగ్యాలూ-కీర్తి ప్రతిష్టలూ..అటు చూడండయ్యా...! కష్టం చేస్తేనే గాని పొద్దు గడవని ఈ కూలిజనం ఇవాళ పనికిపోకుండా యిలా విలపిస్తున్నారంటే..యిదేనయ్యా..ఆ తల్లి చేసుకున్న పుణ్యం.! డబ్బుంటే వస్తారా మనుషులు ? ఆళ్ళకు ఏం పంచిందయ్యా.. పిచ్చది..? తన మనసు తప్ప..దేవుడా ! యింతమంది ఉసురుపోసుకుంటావా ..? " విలపిస్తున్నారు సీతారమయ్యగారు చిన్నపిల్లాడిలా -
ఆ మాటలు విన్న చంద్రశేఖర్ తలతిప్పి చూసాడు తండ్రివైపు. పై కండువాని నోటికి అడ్డంగా పెట్టుకుని కుమిలిపోతున్నాడు తండ్రి. చుట్టూరా వూరిజనం..కూలి జనం.."అమ్మా..తల్లీ.." అంటూ రోదిస్తున్నారు. సొంత మనిషిని పోగొట్టుకున్నవారిలా - ఇంతమందికి ఎలా సన్నిహితురాలైంది ? విషాదం లోనూ వేధిస్తున్న ప్రశ్న అది..!
" నా కోడలు దేవతయ్యా..దేవత..! రైతన్నోళ్ళకి వ్యవసాయం లోనే సాయం చేసిందా ? ఊరికి రోడ్డు వచ్చే విషయం లోనే శ్రమించిందా ? సంఘం పెట్టించి ఆడోళ్ళకు మిషన్లు యిప్పించలా ? ఇంటికోసమే కాదయ్యా..ఊరికోసం తపించింది. పిచ్చిది..మంచి అన్న ప్రతిదాన్ని పోరుపెట్టి నేర్పింది. అది దేవతయ్యా..దేవత..! అందుకే దేవుడు తీసుకుపోయాడు...." చెబుతున్న సీతారామయ్య గారి గొంతు గాద్గదమైంది.
తండ్రి చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోయాడు చంద్రశేఖర్. నమ్మలేకపోయాడు ఒక్కక్షణం. తన నీడలా వున్నమనిషి ఉనికినే గ్రహించలేకపోయిన మూర్ఖుడు తను...కడసారి ఆమెతో గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి చంద్రశేఖరానికి. ఆరోజు శ్రీశైలం బయలుదేరుతున్నాడు. అతనీ లగేజ్ రడీ చేస్తుంది శకుంతల.
" ఏమండీ..ఈ కాంట్రాక్ట్ పూర్తైన తరువాత..మరో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నించమాకండి.." అంది మెల్లగా నచ్చ చెబుతూ. " ఎందుకనీ ? " ప్రశ్నించాడు చంద్రశేఖర్.
" మీనాన్నగారి ఆరోగ్యం సరిగ్గా వుండటం లేదు..మీకుచెప్పాలంటేనే ఆయనకు యిబ్బందిగా వుంది. మీ సమక్షంలో ఎక్కువ టైం గడపాలని ఆయన ఆకాంక్ష. మీరు ఇంట్లో వుంటే ద్రైర్యం గానూ వుంటుంది, ఆనందం గానూ వుంటుంది. నాక్కూడా ఈ మధ్య తలంతా నెప్పిగా , తిరుగుతున్నట్లుగా వుంటుంది..ఎక్కడ పడిపోతాననే భయం.." చెప్పింది లాలనగా.
" అనవసరమైన ఆలోచనలు తలకెక్కించుకుని మనసు పాడుచేసుకోకు. మీకేం కాదులే. అవకాశాలు ఉన్నప్పుడు వినియోగించుకోకపోతే ఎట్లా..? మనకు కావాలన్నప్పుడు సంపాదించగలమా..? " సీరియస్ గా చెప్పాడు సమాధానం.
"అదేదో మీరు యిక్కడే వుండి సంపాదించవచ్చుగా..? "
" ఈ పల్లెటూర్లో ఏముంటుందే సంపాదించడానికి..మట్టితప్పా..?"చిరాకుపడ్డాడు భార్యమీద.భర్తకు కోపం వచ్చిందన్న సంగతి గ్రహించింది శకుంతల. బయలుదేరేముందు అతడ్ని చిరాకుపెట్టి పంపడం ఇష్టం లేదామెకు.
"అన్నిపనులూ సంపాదనతో ముడిపెట్టడం తప్పండి ఇంజీనీర్ గారు..డబ్బు సుఖాన్నిస్తుందేమో కానీ సంతోషాన్నివ్వదు..గ్రహించండి.." అంది అతని మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ..మరింత కోపం వచ్చింది చంద్రశేఖరానికి. అతను ఆమెలా మాటకారి కాదు.
"ఓహో..యిప్పుడు నువ్వు వ్యవసాయంతొ సంపాదించిన దానితోనే సంతోషిస్తున్నావన్నమాట..?
"నేను వ్యవసాయంలో ఆదాయాన్ని చూడటంలేదండి. నా చదువుతో నలుగురికి సవ్యమైన సాయం చేస్తున్నాను. అదే ఆనందం నాకు..ప్రేమగా..ఒక విత్తన్నాన్ని నాటి..అది మొక్కై పువ్వులు పూస్తుంటే.." ఉత్సాహంగా చెప్తున్న ఆమె మాటలను మధ్యలోనే తుంచేస్తూ..
" వెధవ న్యూసెన్స్...ఎప్పుడూ ఆ మట్టి కబుర్లే.." విసుకున్నాడు చిరాకుగా -బాధపడలేదు శకుంతల. భర్త నైజం పూర్తిగా తెలిసిన మనిషి..అందుకే
" సారీ.. అయ్యవార్కి కోపం వస్తే ఆపేస్తాను.." అంది చిలిపిగా ఆతని కళ్ళల్లోకి చూస్తూ "డబ్బు విలువ తెలిసి ఏడిస్తేగా.." ఉడుకున్నాడు ఆమె నవ్వుని చూసి.
" అయ్యా..! మహానుభావా...! మీరు ధనాశ్వం మీద స్వారీ చేసే రౌతులు..మేము మట్టితో కుస్తీ పట్టే రైతులం..మాగాణీల గురించి తప్ప ..ఏ కాణీల సంగతి మాకు తెలియదు.." అంది అతనికి దగ్గరగా వచ్చి నిలబడి, మూతిని తిప్పుతూ, నవ్వును దాచుకుంటూ..
మనుషులను కుట్టి హింసించే తెనేటీగలను సుమం ఆకర్షించినట్టు- ఆమె స్వచ్చమైన నవ్వు, దానిలో మకరందం లాంటి ప్రేమ, అతడి కోపాన్ని హరించింది.
" మాటలకేం తక్కువలేదు.." అన్నాడు ఆమెను బిగి కౌగిలిలో బంధిస్తూ..
"మీ చేష్టలకేం తక్కువా ? వదలండి.." అంది విడిపించుకోవాలనే ప్రయత్నాన్ని నటిస్తూ. ఆ ప్రయత్నం అతనికి మరింత ఆనందాన్నిచ్చింది. మనసు మరిన్ని మురిపాలను కోరుకుంది. ఆమెను మరింత గట్టిగా బందిస్తూ, అడిగాడు చంద్రశేఖర్ ప్రేమమీర.
"నీకేం కావాలో చెప్పు "
"నా మనసులోని కోరికను నేను చెప్పకుండానే, మీరు తెలుసుకోవడం కావాలి.."
"పిచ్చిమొద్దు ఎప్పుడూ మాటల్తోనే గెలుస్తావ్.." అంటూ హృదయానికి హత్తుకున్నాడు ప్రేమగా...
ఆ..క్షణం తెలియదు అతనికి..అవే కడసారి అనుభూతిని మిగిల్చే క్షణాలని -
******
కుమిలిపోతున్నాడు చంద్రశేఖర్ అందరికి దూరంగా వెళ్ళి నిలబడి-అనుభూతులు జడివానై వర్షిస్తున్నాయి అతని కళ్ళవెంట. జరగవలసిన పనులు జరిగిపోతున్నాయి కాలంతో పాటే-మంచితనంతో మెరిసి, అందరి మనసుల్లో మురిసి, సాయం సంధ్య అరుణకాంతిలో కలసి, ' చితి మంటల్లో స్మృతిగా మారిపోయింది శకుంతల ' -
******
భార్యా వియోగం చంద్రశేఖర్ జీవితంలో ఎంతో మార్పును తీసుకువచ్చింది. ఇప్పుడు మునుపటిలా అతనిలో సంపాదన మీద ధ్యాస లేదు.'తనవి ' అన్న వాటి మీద, తన వారి మీద 'తనివి 'తీరని ప్రేమను పెంచుకున్నాడు. తల్లితండ్రలకు సేవచేస్తూ, ఆ పల్లె జన జీవన వికాసానికి దోహదపడుతూ, మిగిలిన తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలను కున్నాడు.
.ఇంతకాలం ఆడంబరాల వలయం చుట్టూ తిరిగిన ఆతని అంతరంగం ఇప్పుడు ప్రేమానురాగాల నిలయమైంది. ఊరిప్రజల హృదయాల్లో కొలువైయ్యాడు కొండంత అండలా.
"మొదటిసారి వ్యవసాయంలోకి దిగి, రతనాలనూ, రాజనాలనూ పండించాడు మన చంద్రశేఖర్..ఆ హస్తవాసి అటువంటిది మరి.." అని మురిపెంగా చెబుతున్న ప్రజల మన్నలను, నిండుగా పండిన వరికంకుల్లో చూస్తున్నాడు చంద్రశేఖర్ పొలం గట్టున కూర్చుని..
'ధాన్యలక్ష్మి ' నిండు చూలాలై కనుచూపుమేర తన పొలాన్నంతా ఆక్రమించుకుని పరుండినట్లుగా వుంది..పంటను చూస్తుంటే..!ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర్.
ఎంతోమంది తనలా. మనిషి బ్రతికివుండగా వారి ఉనికిని గ్రహించక, చేజారిన తరువాత విలపిస్తారు జీవితాంతం. 'వస్తువైనా మనిషైనా బ్రతికివుండగా భధ్రంగా చూసుకునే వారు ఎంత అదృష్టవంతులు ? "వస్తువులో కూడా ప్రాణాల్ని చూడగలుగుతున్నాడిప్పుడు చంద్రశేఖర్.
తనలో కలిగిన మార్పుని చూసి " శకుంతల " ఎంతో పొంగిపోయేది. పిచ్చిది..జీవితాన్ని ఎంతగా ప్రేమించింది ? అందరి ప్రేమను జీవితంగా మార్చుకుంది. కానీ, జీవితాంతం తోడుగా వుండాల్సిన మనిషిని మాత్రం జీవించివుండగా మర్చలేకపోయింది. ఆమె బ్రతికివుండగా తనకీ గ్రహించే స్థితిలేదు. తననీ స్థితిలో చూడాలని తపించిన మనిషి యిప్పుడు బ్రతికిలేదు.' వియోగంలోనే యోగం వుంది...' హృదయమంతా శకుంతల రూపంతో నిండివుంది.
మలయమారుతం యొక్క పిల్లతెమ్మెర అల్లరికి లయబద్ధంగా వూగుతున్నాయి వరికంకులు. ఆ వరికంకుల సుతిమెత్తని సవ్వడిలో తన భార్య శకుంతల
" గుండె చప్పుళ్ళ " ను వింటున్నాడు చంద్రశేఖర్, ఆమె ఙ్ఞాపకాలతో మమేకమైపోయి......
******
( స్వాతి వార పత్రిక 14.9.2001 )
8, డిసెంబర్ 2008, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి